Jabardasth Artist : రైలు ఎక్కబోయి జబర్దస్త్ నటుడు దుర్మరణం.. ఎలా జరిగిందంటే?

Jabardasth Artist : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన జబర్దస్త్ టీవీ ఆర్టిస్టు మృతి చెందాడు. ట్రైన్, పట్టాల మధ్య ఇరుక్కోవడంతో ప్రాణాలు వదిలాడు. చుంచుపల్లి మండలంలోని నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్‌ తన ఫ్యామిలీతో నివాసముంటున్నాడు. అయితే, జూన్ 21న శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం రైల్వే స్టేషన్‌కు వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌లో ముందుకు కదులుతోంది. అదే ట్రైన్ ఎక్కేందుకు మహ్మద్దీన్ ప్రయత్నించాడు.

రైల్లో నుంచి కాలు జారికిందపడటంతో ట్రైన్, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు రైలు చైన్ లాగడంతో లోకో పైలెట్ రైలు ఆపేశారు. రైల్వే పోలీసులు, సిబ్బంది అక్కడికి చేరుకుని టీవీ ఆర్టిస్ట్ మహ్మద్దీన్‌ను బయటకు తీశారు. హుటాహుటిన అతన్ని అంబులెన్స్‌లో కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Jabardasth Artist : జబర్దస్త్ ఆర్టిస్ట్ మహ్మద్దీన్ మృతి

వైద్య పరీక్షలు చేసిన వైద్యులు మహ్మద్దీన్ నడుం, పక్కటెముకలకు తీవ్రంగా దెబ్బతిన్నాయని నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా మార్గం మధ్యలో మహ్మద్దీన్ మృతిచెందాడు. మృతదేహాన్ని మరో ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జబర్దస్త్ టీవీ ఆర్టిస్టుగా మహ్మద్దీన్ రాణిస్తున్నారు. ఈటీవీ జబర్దస్త్‌ షోతో బాగా పాపులర్ అయ్యాడు. దాదాపు 50 ఎపిసోడ్‌లలో తన నటనతో ఆకట్టుకున్నాడు.

హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉందని హడావుడిగా ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు ఫ్యామిలీతో కలిసి వచ్చాడు. కానీ, ట్రైన్ ఎక్కడంతో మహ్మద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహ్మద్దీన్‌ చనిపోవడంతో నందాతండా సోకసంద్రంలో మునిగిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒకవైపు రాణిస్తూనే.. తన కుమార్తెలను చదవిస్తున్నాడు. మహ్మద్దీన్‌ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు బోరుమని విలపిస్తున్నారు.

Read Also : Kalki 2898 AD Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. కల్కీ 2898 ఏడీ మూవీ ట్రైలర్ చూశారా..? ఫైనల్ వార్ అదిరింది..!